మహిళా బిల్లుతో నవశకం.. ఏపీలో మాత్రం 'రెడ్‌బుక్' రాజ్యమేలుతోంది: విడదల రజిని

  • మహిళా శక్తితో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టవచ్చన్న రజని
  • మహిళల అభివృద్ధి కోసం సామాజికి సంస్కర్తలా ఆలోచించిన ఏకైక నాయకుడు జగన్ అని కితాబు
  • కూటమి ప్రభుత్వంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపణ

దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు కార్యరూపం దాల్చిన ఈరోజు దేశ చరిత్రలో ఒక గొప్ప రోజని వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని కొనియాడారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, ఈ బిల్లుతో దేశ భవిష్యత్తు మారబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. 


మహిళా శక్తితో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టవచ్చని, ఇప్పటికే వైసీపీ ఈ బిల్లుకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించిందని గుర్తుచేశారు. మహిళల అభివృద్ధి కోసం సామాజిక సంస్కర్తలా ఆలోచించిన ఏకైక నాయకుడు జగన్ అని, ఆయన హయాంలో అమలైన 90 శాతం పథకాలు మహిళా సాధికారత కోసమే రూపొందించబడ్డాయని ఆమె పేర్కొన్నారు.


అయితే, ఇదే సమయంలో ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విడదల రజని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిందని, మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. "జగనన్న హయాంలో దిశ యాప్, మహిళా పోలీస్ స్టేషన్లు, జీరో ఎఫ్ఐఆర్ వంటి వినూత్న కార్యక్రమాలతో మహిళలకు భద్రత కల్పిస్తే... నేడు చంద్రబాబు హయాంలో కేవలం 'రెడ్‌బుక్' పాలన మాత్రమే సాగుతోంది" అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారంటూ ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్, చంద్రబాబులు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వారిని వెనక్కి తెచ్చారా? అని నిలదీశారు.


మహిళల పట్ల అఘాయిత్యాలకు పాల్పడుతున్న కూటమి ఎమ్మెల్యేలు, నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రజని ప్రశ్నించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు వస్తున్న తరుణంలో, క్షేత్రస్థాయిలో వారి రక్షణను గాలికి వదిలేయడం శోచనీయమన్నారు.


Vidadala Rajini
Andhra Pradesh
Women Reservation Bill
YS Jagan
Chandrababu Naidu
Red Book
Women Safety
AP Politics
Disha App
Pawan Kalyan

More Telugu News